25, ఆగస్టు 2009, మంగళవారం

శాస్త్రవేత్తల "రాత" ని మారుస్తానంటున్న- "గూగుల్ వేవ్"


ఆగస్టు ౨౨ న లండన్లో జరిగిన "సైన్స్ ఆన్లైన్" శాస్త్రవేత్తల సమావేశంలో ఇంటర్నెట్ విజ్ఞానశాస్త్ర అభివృద్దికి, శాస్త్ర విజ్ఞాన పరస్పరోపయోగానికి ఎంత వరకు దోహద పడుతుంది అన్న అంశం మీద చర్చించారు. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కామెరాన్ నెయ్లోన్ అనే జీవరసాయన శాస్త్రవేత్త, " గూగుల్ వేవ్" శాస్త్రీయ సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావోచ్చో వివరించారు.

గూగుల్ వేవ్ శాస్త్రవేత్తలకి అనుకూలంగా ఉండే అనేక ఉపకరణాలతో రూపుదిద్దుకుంది. ముఖ్యంగా, వేరు వేరు ప్రాంతాలలో పరిశోధన చెస్తున్నప్పుడు సమాచారాన్ని, పరిశోధనా అంశాలని ఒకే సమయంలో అన్ని చోట్లా అందుబాటులో ఉండేట్టు చెయ్యవచ్చు. దీనితోపాటు, ఇందులో అనుసంధాన పరచిన కొన్ని స్వయంచాలక ( ఆటో మీటేడ్) ఉపకరణాలు పరిశోధనా అంశాల ప్రచురణాప్రతులు రాయటాన్ని ఎంతో సులభతరం చేస్తాయి. ఐతే, గూగుల్ వేవ్ ని నిజంగా శాస్త్రవేత్తలకి ఉపయోగకరంగా రూపుదిద్దలంటే, ప్రస్తుతం వాళ్లు ఎదురుకొనే ముఖ్యమైన సమస్యల పరిష్కరాల్ని పొందుపరచాలని డా,, కామెరాన్ నెయ్లోన్ పేర్కొన్నారు.

22, ఆగస్టు 2009, శనివారం

వరదని తట్టుకొనే వరిపంట


మన దేశంలో రైతులు ఎదురుకొనే సమస్యలలో ఒకటి వరద తాకిడకి పంటని కోల్పోవటం. ఇది కేవలం మన దేశంలో రైతుల సమస్యే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాల ఆహరోత్పతిని దెబ్బతీస్తున్న సమస్య. అందునా వరి పంట నీటిలో పూర్తిగా మునిగి, రెండు మూడు రోజులకే చనిపోతుంది. జపాన్ ఈసమస్యకు శాశ్వత పరిష్కారంగా, వరదని తట్టుకొనే ఆహారధాన్యాల ఉత్పత్తి చెయ్యగలిగే పరిశోదనలను ప్రోత్సహించింది. దీని ఫలితంగా, నగోయ విశ్వవిద్యాలయానికి చెందిన మొతోయుకి ఆశికారి బృందం వరద సమయంలో పంట పూర్తిగా నీట మునిగినప్పుడు కాండం ఎదుగుదల నీటి మట్టానికి పైకి రావటానికి ఉత్పేర పరచే జన్యువులను కనుగొన్నారు. వీటిని స్నోర్కెల్ ౧, స్నొర్కెల౨ గా పేర్కొన్నారు. ఈ రెండు జన్యువుల సంయుక్త చర్య వలన ఆహారధాన్యాలు ఇచ్చే మొక్కలు నీటి మట్టానికి తగ్గట్టుగా ఎనిమిది మీటర్లు వరకు పెరుగుదల చూపుతున్నట్టు వీరి పరిశోధనలో తేలింది.

ఇక శాస్త్రీయ ప్రమాణాలకు వెళితే, "స్నోర్కెల్ ౧" మరియు "స్నోర్కెల్ ౨" అన్న జన్యువులు కేవలం ఇథిలీన్ అనే రసాయనం మొక్కలో ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడే వాటి ఎదుగుదలని ప్రేరేపిస్తాయి. వరి మొక్కలలో ఇథిలీన్ శాతం కేవలం నీటిలో ఎక్కువ శాతం మునిగినప్పుడే ఉత్పతి కావటం వలన, వరద లేని సమయంలో వరి మొక్కలలో ఈ జన్యు మార్పిడి ఎలాంటి ప్రభావం చూపించదు.

ఇది ఇలా ఉండగా, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన వేరొక పరిశోధనా బృందం వరద నీటిలో పూర్తిగా మునిగినా, జపాన్ పరిశోధనా బృందం చెప్పినట్టుగా మొక్క నీతిమట్టానికి పైకి ఎదిగే అవసరం లేకుండానే బ్రతకగలిగే వరి మొక్కలని జన్యు మార్పిడి ద్యారా కనుగొన్నారు. దీనికి ఉపయోగ పడే జన్యువును "సబ్ ౧ ఎ" గా పేర్కొన్నారు. ఈ బృందానికే చెందిన పమేలా రోనాల్డ్ మనదేశంలో ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న స్వర్ణ జాతికి చెందిన వరి మొక్కల మీద కూడా ఈ పరిశోధనలు చేసి విజయం సాదించినట్టు "నేచర్ " లో ప్రచురించిన పరిశోధనా పత్రంలో తెలిపారు.

17, ఆగస్టు 2009, సోమవారం

"ఉప్పు నుంచి శక్తి"

నేచర్ ౪౬౦, ౭౮౨ ( ౧౩ ఆగస్టు ౨౦౦౯)

స్వచమైన నీటితో లవణం అధికంగా ఉన్న నీటిని కలపటం వలన మానవ అవసరాలకు పనికివచ్చే ఉష్ణ శక్తిని పుట్టించవచ్చు. అయితే, అలా పుట్టిన శక్తిని రూపంలో ఎలా భద్రపరచాలన్నది ప్రస్తుతం శాస్త్రవేత్తలని తొలచివేస్తున్న విషయం. దీనికి చక్కటి పరిష్కారం తో దొరిఅనో బ్రోగిఒలి అనే ఇటలీలో మిలన్ -బికచ్కా విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త ఒక నమూనాని ప్రదర్శించారు.

నమునాలో కార్బన్ ఎలక్ట్రోడ్ (విద్యుత్ దండం) ని ముందుగా ఉప్పునీటితో చర్య వలన విద్యుతావేసం వచ్చేవరకు ఉంచి, తరవాత ఉప్పునీటిని తొలగించి స్వచమైన నీటితో నింపవలెను. దీనివలన ఎలక్ట్రోడ్స్ నుంచి దూరంగా వెళ్ళే ఉప్పు అణు సకలాల (ఐయానుల) వలన, ఎలక్ట్రోడ్స్ మద్యలో పీడన తారతమ్యం పెరగటం వలన, వాటికి అనుసంధాన పరచిన విద్యుత్ వలయంలో రసాయన శక్తీగా భద్రపరచవచ్చు.

16, ఆగస్టు 2009, ఆదివారం

తెలుగు లో "ఆధునిక శాస్త్ర విజ్ఞానం"

శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, తెలుగులో అది లభించటం చాలా అరుదు. కారణం- మన మాతృభాషలో శాస్త్రీ విషయాలు తెలుసుకోవాలనే ఆకాంక్ష మనలో లోపించటం. ప్రస్తుత సమాజంలో ఎక్కువ సంఖ్యలో తెలుగు వాళ్ళు ఉన్నతవిద్యను పొందగలగటం, విజ్ఞానశాస్త్ర రంగాలలో తమ ఉనికిని చాటిచెప్పటం అభినందనీయం. అయితే, ఎప్పుడైతే మనిషి అభ్యున్నతికి, ముందుతరాలవారికి ఉపయోగపడే శాస్త్రీయ సంపదని బాష తనలో దాచుకోలేదో, అప్పటినుంచి భాష శిథిలమవుతున్నట్టే. ఈ పరిస్థితుల్లో ఆదునిక శాస్త్ర విజ్ఞానాన్ని అందించగల భాష మాత్రమే మనుగడ నిలుపుకోగలుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. శాస్త్ర విజ్ఞానం మానవజాతికన్తటికి అందుబాటులో ఉండేట్టుగా ఆంగ్లంలో ప్రచురించబడటం సమంజసమే అయినా, మిగిలిన భాషలలో ఆ విజ్ఞానాన్ని అందించటం ఆయా భాషలు మాతృభాషలుగా ఉన్న విద్యావేత్తలు భాద్యతగా భావించాలి. పాశ్చాత్య దేశాలతో పాటు మనకి అన్నిటిలో పోటీగా నిలుస్తున్న చైనా కూడా దీనిని సమర్దంగా నిర్వహించటం గమనించతగ్గ విషయం. అయితే ఆయా దేశాలలో విశ్వ విద్యాలయాలల్లో ఉన్నత విద్యా-పరిశోధనలు వారి భాషల్లోనే జరగటం, కనిపెట్టిన విషయాలని వారి భాషల్లోనే మొదటగా ప్రచురించటం, ఆయా భాషాసంపదని ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తున్నాయి. ఈవిధంగా విద్యా బోధన, పరిశోధన మరియు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించని భాషలు ఉనికిని కోల్పోవటం సహజం.

మన దేశంలో తెలుగుతో పాటు ఎన్నో భాషలు ఇలాంటి దయనీయ స్థితిలో ఉండటానికి పైన చెప్పిన కారణాలు తక్కువనే చెప్పొచ్చు. అయితే, తెలుగుపై మన భాషాభిమానాన్ని చాటేందుకు తెలుగుకి ప్రాచీన భాషగా గుర్తింపు రావటానికి కారణమైన మహానుభావుల్ని స్మరించుకోని గర్వంగా నిట్టూర్చితే సరిపడదు. ప్రతి తెలుగువాడు వాళ్ళ వాళ్ళ రంగాల్లో తెలుగుతల్లి మూగబోకుండా తమవంతు కృషి చేసినప్పుడే దానికి సార్ధకత. అప్పుడే తెలుగుతల్లి తన బిడ్డలకి జ్ఞానామృత క్షీరదారని అందించగలదు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా తెలుగుతల్లి గౌరవాన్ని నిలిపే తెలుగుజాతి ఉద్బవించగలదు.

ఇందులో నావొంతు ప్రయత్నంగా "నేచర్" లో ప్రచురించే సమకాలీన శాస్త్ర విజ్ఞానాన్ని తెలుగులో శక్తికొలది అందిచే ప్రయత్నం ఈ " అణు ధర్శని" కూడలి. తెలుగులో మాట్లాడటానికే సంకోచించే ప్రస్తుత సమాజంలో, ఈ కూడలి తెలుగు తల్లికి మల్లెపూదండ కాకపోయినా, పాదాలపై ఒక చల్లని మంచుబిందువు కాకపోవునా అని ఆకాంక్షిస్తూ.....